అతుల్ ఆత్మహత్య కేసు.. పరారీలో భార్య.. ఆమె తల్లి, సోదరుడి అరెస్ట్

  • దేశవ్యాప్తంగా సంచలనమైన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు
  • సెక్షన్ 498ఏ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కూడా ఆవేదన
  • భరణానికి సంబంధించి 8 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ మార్గదర్శకాలు
  • ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతుల్ అత్త, బావమరిది అరెస్ట్
  • పరారీలో ఉన్న భార్య నికిత కోసం గాలింపు
దేశవ్యాప్తంగా సంచలమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ (34) ఆత్మహత్య కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. భార్య, అత్తింటి వారి చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అతుల్ రాసిన 40 పేజీల సూసైడ్ నోట్, 90 నిమిషాల వీడియో రికార్డింగ్ సంచలనమైంది. సూసైడ్ నోట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టుకు పంపించాడు. వేధింపులకు గురవుతున్న భర్తలను కాపాడాలని అందులో వేడుకున్నాడు. తన భార్య, అత్తింటి వారితోపాటు తన ఆత్మహత్యతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేయాలని కోరాడు. విడాకుల సెటిల్‌మెంట్ కోసం రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అందులో సుభాష్ పేర్కొన్నాడు. 

అతుల్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సెక్షన్ 498ఏపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతున్నట్టు చెబుతూ విచారం వ్యక్తం చేసింది. భరణం విషయంలో 8 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు అతుల్ అత్త నిషా సింఘానియా, ఆయన బావమరిది అనురాగ్ సింఘానియాను గత రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతుల్ భార్య నికిత సింఘానియా కోసం గాలిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని జౌన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించారు. అనంతరం కోర్టు అనుమతితో వారిని ఈ రోజు (శుక్రవారం) బెంగళూరుకు తరలిస్తున్నారు.

Atul Subhash
Software Engineer
Crime News
Nikita Singhania
Karnataka Police

More Telugu News